04 November 2013

పంచామృతం అంటే ?

ఏ శుభకార్యం చేయవలసి వచ్చినా పంచామృతం తప్పనిసరిగా ఉపయోగిస్తాము. గుడిలో అభిషేకం చేయవలసి వచ్చినా పంచామృతం వుంటుంది. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు ప్రసాదంతోబాటు తీర్ధంగా కొబ్బరినీళ్ళు ఇస్తారు. వీటితో పాటు కొన్నిసార్లు పంచామృతాన్ని కూడా ఇస్తారు. కొన్ని దోషాల నివృత్తి కోసం పంచామృతంతో అభిషేకాన్ని సూచిస్తారు జ్యోతిష్యవేత్తలు, పండితులు. దాన్ని బట్టే పంచామృతం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.
పంచామృతం అంటే….


పంచదార, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఈ అయిదింటిని కలిపి పంచామృతంగా చేస్తారు. ఇక్కడ పాలు అంటే ఆవుపాలు అని అర్థం. పెరుగు, స్వచ్చమైన నెయ్యి, తేనె, చక్కెరలను ఆవుపాలలో కలుపుతారు. భక్తి పరమైన విషయాలను పక్కన పెడితే ఈ అయిదు పదార్థాలూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి! అది ఎలాగో ప్రస్తుత వైద్య విజ్ఞానం ప్రకారమే చూద్దాం!

ఆవు పాలు

ఆవును గోమాత అన్నారు. ఎందుకంటే, ఆవు పాలు తల్లి పాలతో సమానమైనవి. శ్రేష్టమైనవి. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. గేదెపాలకు మల్లేనే ఆవు పాలలో కూడా కాల్షియం అత్యధికంగా వుంటుంది. కాల్షియం చిన్న పిల్లల్లోనూ, పెద్దలలోనూ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పాలు నిజంగానే అమృతంలా పనిచేస్తాయి. పాలు ఎక్కువగా తాగటం వల్ల బరువు తగ్గుతారని పరిశోధనలలో వెల్లడైంది. పాలలో విటమిన్ ‘ఎ’ కూడా పుష్కలంగా వుంటుంది. ఇది అంధత్వం త్వరగా రాకుండా నివారిస్తుంది.
పెరుగు

పెరుగులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పెగుగు కూడా త్వరగా జీర్ణం అవుతుంది. ఉష్ణ తత్వం వున్నవారికి పెరుగు అత్యధ్బుత ఔషధంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధమైన వ్యాధులను నయంచేసే విషయంలో పెరుగు అత్యంత శక్తివంతంగా పనిచేస్తుందని పరిశోధనలలో తేలింది. కేశ సంరక్షణలో కూడా పెరుగుకే అగ్రస్థానం వుంది. ఉదయం పూట పెరుగు తినటం ఆరోగ్యదాయకం. మన పూర్వీకులు పెరుగుతో అన్నం తిని పొలం పనులకు వెళ్ళేవారు. ఉదయం పూట గుడికి వెళ్ళి పెరుగుతో పంచామృతం తీసుకోవటం ఈ విధంగా చూసినా మంచిదే!

నెయ్యి

మేధాశక్తిని పెంచటంలో నేతిని మించింది లేదు. ఆయుర్వేదం ప్రకారం నేతితో తయారైన అరిసెల్లాంటి పదార్థాలు, నెయ్యితో వేయించిన జీడిపప్పు తదితర ఆహారపదార్థాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పిల్లలు తినే ఆహారంలో ప్రతిరోజూ నెయ్యి వుండేలా చూసుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతం అవుతుంది. చర్మ సౌందర్యం పెరుగుతుందని ఆయుర్వేదం సూచిస్తోంది. అయితే నెయ్యిని పరిమితంగానే వాడాలి. నెయ్యిలో ‘ఎ’ విటమిన్ వుంటుంది.
తేనె

వేల సంవత్సరాల నుంచీ కూడా తేనెను పోషకాహారంగా ఉపయోగిస్తున్నారు. తేనె రుచిగా ఉండటము, మంచి పోషకాహారం కావడమే కాదు, ఇది ఒకరకంగా యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. తేనె సూక్ష్మ క్రిములతో శక్తివంతంగా పోరాడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను దగ్గరకు రానీయదు. తేనె ఆహార పదార్థాలు త్వరగా జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. తేనెలో ఖనిజాలు చాలా ఎక్కువ స్థాయిలో వుంటాయి. తేనెను సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. తేనె చర్మ సంరక్షణలో అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది. ఇకపోతే, పంచదార శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
ఇన్ని సుగుణాలున్న పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార కలయికతో రూపొందించిన పంచామృతం శరీరానికి ఎంత మేలు చేస్తుందో దీన్ని బట్టే అర్థమవుతోంది. కనుక ప్రసాదం రూపంలో తీసుకునే పంచామృతం ఎంతో మేలు చేస్తుంది

No comments:

Post a Comment