01 November 2013


ప్రదక్షిణం :

ప్రదక్షిణం చేయడం అంటే " ఓ భగవంతుడా! నేను అని వైపుల నుండి నిన్నే అనుసరిస్తున్నాను. నా జీవితం అంతా నీవు చెప్పిన మార్గంలోనే నడిపిస్తాను, నీవు చెప్పినట్టే జీవిస్తాను " అని పరమాత్మకు చెప్పడం.

దేవాలయాలు పవిత్రమైన స్థలాలు. మన దేవాలయానికి వెళ్ళగానే, ఆలయ ప్రవేశానికి ముందు ప్రదక్షిణం చేస్తాం.

ప్రదక్షిణం పదంలో ప్రతి అక్షరానికున్న గొప్పతనం తెలుసుకుందాం.'ప్ర ' అనే అక్షరం సకలపాపవినాశనానికి సూచకం. ' ద ' అనే అక్షరానికి అర్ధం కోరికలన్నీ తీరడం. 'క్షి ' అంటే రాబోవు జన్మలఫలం. 'ణ ' అంటే అజ్ఞానం నుండి విముక్తిని ప్రసాదిస్తుంది.


శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ |
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ||

శ్లో || పాపోహం పాప కర్మాణాం పాపాత్మా పాప సంభవః |

త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల ||

శ్లో || అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |

తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన ||


అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, భవిష్యత్తులో కూడా పాపం చేసే అవకాశం ఉంది. నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. ఓ జనార్దన! నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.

ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ చుట్టూ మనం తిరిగే అవకాశమే లేదు. అటువంటి పరమాత్మ మనలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు, మనలో ఉన్న పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే, బాహ్యవిషయాలను పక్కనబెట్టి, మన గురించి మనం విచారించాలని గుర్తుచేసేది, మనల్ని మన ఆత్మతత్వం చుట్టు తిప్పెది ఈ ప్రదక్షిణం.


ప్రదక్షిణలు చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చూట్టు ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని పొంది, గణాధిపతి అయ్యాడు. గౌతమ మహర్షి గోవు చూట్టు ప్రదక్షిణ చేసి బ్రహ్మమానస పుత్రిక, మహా సౌందర్యవతి అయిన అహల్యను భార్యగా పొందాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలుంటాయి.


అయితే ప్రదక్షిణ వలన కలిగే ఫలితాలను సంపూర్ణంగా పొందాలంటే శ్రద్ధతో చేయాలి. ఫోన్ మాట్లాడుతూనో, పాటలు వింటునో,లేక ఏదో పందెంలో పరిగెత్తినట్టు పరుగులు తీస్తేనో, ప్రక్క వాళ్ళతో మాట్లడుతూనో, ప్రదక్షినలు చేస్తే ఒరిగేదేమి లేదు.


ప్రదక్షిణ సమయంలో, మనం ఏ దైవం చూట్టు ప్రదక్షిణం చేస్తామో, ఆ దైవానికి సంబంధించిన శ్లోకాలనో, కీర్తనలనో, మంత్రాలనో పఠిస్తూ ప్రదక్షిణ చేయాలి. ఉదాహరణకు, శ్రీ వేంకటేశ్వర స్వామి చూట్టూ ప్రదక్షిణం చేస్తుంటే, "ఓం నమో వేంకటేశాయ " అనే నామన్ని ఉచ్చరించాలి. ఒకవేళ మనకు కీర్తనలు, పాటలు, మంత్రాలు ఏవి తెలియవనుకోండి, అప్పుడు "ఓం " కారాన్ని ఉచ్ఛరిస్తూ ప్రదక్షిణం చేయండి.


ప్రదక్షిణం నిర్మలమైన మనసుతో చేయాలి. అలా చేయడం వలన మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటాం.

No comments:

Post a Comment