04 November 2013

సన్యాసుల చేతిలో పొడవైన కర్ర ఎందుకు ?

వైరాగ్యానికి, తాత్వికతకూ, ద్వైత, అద్వైత భావానికీ పొడవైన కర్ర గుర్తుగా పెట్టుకొంటారు సన్యాసులు! (యతులు).

‘Y’ ఆకారంగల పద్దెనిమిది అంగుళాల పొడవున్న ‘యోగదండ’ మనే పేరుగల దండాన్నీ, కమండలాన్నీ పట్టుకొని వుండేవారిని ‘తాపసులు’ అంటారు. ‘ఋషులు’ అని కూడా అంటారు.


గాలి-నీరు-భూమి-అగ్ని-ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనేమ్ మనిషి కాబట్టి ఐదు అడుగుల పొడవైన చేతి కర్రను ధరిస్తారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అని మూడు విధాలు వున్నాయి. ఒకే ఒక కర్రను ధరించి వుండేవారు అద్వైత సిద్ధాంతం కలవారు. అద్వైతం అంటే జీవుడు దేవుడు (శ్రీ శంకరాచార్యమతం) ఒక్కటేననే సిద్ధాంతం మనిషిలోనే దేవుడున్నాడు. పరభ్రహ్మత్వమే మనిషిని నడిపిస్తున్నది. స్వర్గము నరకము ఇక్కడే వున్నాయి. అంతరాత్మకు (పరమాత్మకు) విరుద్ధంగా, దైవత్వాన్ని మరుగున పెట్టి, అక్రమ మార్గాన చరిస్తే, ఆ పాపఫలితాన్ని మనం ఏదో ఒక రూపంలో ఇక్కడే అనుభవించాల్సి వస్తుంది అంటుంది అద్వైతం. ఈ అద్వైతం సిద్ధాంతం బోధించేవారి వద్ద ఒకే ఒక్క కర్ర వుంటుంద. జ్ఞానానికి సంకేతమైన అశ్వద్ధ వృక్షం (రావిచెట్టు) నుండి సేకరించుకుంటారు.

రెండు కర్రలను కలిపి ఒక్కటిగాకట్టి చేతధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు. వీర్ని ‘ద్విదండి’ అంటారు. దేవుడు వేరు జీవుడు వేరు (జీవాత్మ పరమాత్మ వేరువేరు) అని బోధిస్తారు. వీరందరూ వైష్ణవ భక్తులే. ఈ సిద్ధాంతాన్నే భారతయుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధిస్తాడు. ద్వైత సిద్ధాంతానికున్న ప్రాచురత్యం అద్వైతానికి అంతగా లేదు. రామానుజాచార్యులు మొదలైన వారెందరో ఈ మతానికి ప్రాణంపోసి ప్రాముఖ్యతను కల్గించారు. ఈ మతం వారిని ‘జీయరు’ లని అంటారు.

మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకొనే వారు కూడా వున్నారు. దీన్ని ‘తత్వత్రయం’ అంటారు. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ మూడింటిని నారాయణ తత్వంగా భావిస్తూ బోధనలు చేస్తారు.

పొడవైన ఈ దండాలతో దుష్టప్రాణులనుండి రక్షణ కల్పించుకొంటారు. ఫలపుష్పాలను ఈ దండం సహాయంతో సేకరించుకొంటూ భగవధ్యానంతో జీవితం గడుపుతుంటారు.

ఋషుల చేతిలో వుండే 18 అంగుళాల యోగదండం జపం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. రుద్రాక్షమాల నేలపైబడి అపవిత్రం కాకుండా ‘Y’ అకారంగల కర్రపై కుడిచేతిని పెట్టి జపమాల త్రిప్పుతుంటారు. ఈ యోగదండం కూడా ఆత్మరక్షణకు యోగీశ్వరత్వానికి వుపయోగపడుతుంది.

No comments:

Post a Comment