01 September 2015

ముక్కోటి ఏకాదశి :-

మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణపరమాత్మ ‘భగవద్గీత’ విభూతియోగంలో చెప్పాడు. అంటే, ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈమాసం, ప్రకృతిని అంటా సౌందర్యమాయం చేస్తుంది. ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సారమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ, ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే ఉత్తరాయణం దేవతలకు పగటికాలమైతే, దక్షిణాయణం రాత్రికాలమని చెప్పబడుతోంది. విష్ణుమూర్తి రాత్రికాలమైన దక్షిణాయనంలో ఆషాడ శుద్ధ ఏకాదశినుండి నాలుగునెలలపాటు యోగ నిద్రలో గడుపుతూ లోకం తీరుతెన్నులను గమనిస్తుంటాడు. అందుకే ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘శయన ఏకాదశి’ (తొలిఏకాదశి) అని అన్నారు. తొలి ఏకాదశికి యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణువు కార్తీక శుద్ద ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీనినిన్ ‘ఉత్థాన ఏకాదశి’ అని అన్నారు.
తిథులన్నింటిలో పవిత్రమైనదిగా చెప్పబడేది ‘ఏకాదశి’. ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ‘ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఆవిధంగా సంవత్సరంలో ఇరవైనాలుగు ఏకాదశులు.’ చాంద్రమానం ప్రకారం, మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలాంటప్పుడు ఇరవై ఆరు ఏకాదశులోస్తాయి. ప్రతిఏకాదశి ఓపర్వదినమనే చెప్పొచ్చు. అసలు ఏకాదశి ఆవిర్భావం కొన్ని విచిత్రమైన పరిస్థితుల మధ్య ఏర్పడింది. పూర్వం మృదుమన్యుడు అనే రాక్షసుడు, శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసి, ఆ స్వామిని మెప్పించి స్త్రీ పురుషుల నుండి తనకు మరణం లేకుండా ఉండేట్లుగా వరాన్ని పొందాడు. వరాన్ని అనుగ్రహించిన శివుడు అయోనిజ అయిన స్త్రీ చేతిలో మరణం తప్పదని చెప్పాడు. అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు, వరగర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని ధాటికి దేవతలంతా పారిపోగా, వారి దేవేరులంతా ఒక ఉసిరిచెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెదుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెదకడానికి ప్రయత్నిస్తుండగా, దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయిన కన్య చెట్టుతొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుడిని సంహారించింది. ఆ కన్యక పేరే ‘ఏకాదశి’, అప్పట్నుంచి ప్రతి పక్షంలో పదకొండవ రోజున ఆమెను పూజించడం ఆచారమైంది.
ఏకాదశి మహాత్యాన్ని తెలిపే అనేక కథలు మన పురాణాలలో ఉన్నాయి. ఆ కథలలో రుక్మాంగదుని కథ ఒకటి. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు చక్కగా పరిపాలన చేస్తూ, ప్రజలను కంటి పాపలవలె చూసుకుంటుండేవాడు. ప్రజలు కూడ ధర్మవర్తనులై జీవిస్తుండే వారు. ఫలితంగా పాపులు బాగా తగ్గడం వలన యమునికి పని లేకుండా పోయింది. పాపుల కోసం యముడు చిత్రగుప్తునితో కలసి ఓ పన్నాగం పన్నాడు. ఆ పథకం ప్రకారం, రంభ మోహినీ వేషధారిణియై, రుక్మాంగదుని వ్రతభ్రష్టుని చేయాలి. ఒకరోజు రుక్మాంగదుడు వేటకు వెళ్తుండగా, మార్గమధ్యంలో తారసపడిన మోహినీ రూపంలోనున్న రంభను చూసిన రుక్మాంగదుడు మొహావేశపరవశుడై తనను వివాహమాడమని బ్రతిమాలాడు. అందుకు ఆమె ఎల్లవేళలా తన వశవర్తియై ఉంటేనే పెండ్లాడతానని నిబంధన పెట్టింది. అందుకు అంగీకరించిన రుక్మాంగదుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. రుక్మాంగదుని వ్రతబ్రష్టున్ని చేయడమే ఆమె లక్ష్యం కనుక ఓ ఏకాదశినాడు తనతో దాంపత్యసుఖాన్ని పంచుకోమని చెప్పింది. అందుకు రుక్మాంగదుడు వ్యతిరేకించాడు. అయితే దానికి ప్రతిగా అతని కుమారుని సంహరించమని ఆమె కోరింది. ఏకాదశివ్రతాన్నే గొప్పగా భావించిన రుక్మాంగదుడు కన్నకొడుకును చంపడానికి నిర్ణయించుకోగా, అతని భక్తికి మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై, జరిగిన మోసాన్ని అతనికి వివరించి, రుక్మాంగదునికి మోక్షాన్ని ప్రసాదించాడు.
ఇక ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి పర్వం సుఖసంతోషాలను అందించే పర్వంగా భక్తజనులచే ఎంతో గొప్పగా జరుపబడుతుంటుంది. మన తెలుగువాళ్ళు ఈ పండుగను ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలుచుకుంటూఉంటారు. ఈ రోజున విష్ణువు మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చాడనీ, అందుకే ఈ పండుగ ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలువబడుతోంది అంటారు. స్వామి భూలోకానికి దిగి రావడం వెనుక ఓ ఉదంతం ఉంది. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా మురాసురుడు అనే రాక్షసుడు రాజ్యపాలన చేస్తూ, దేవతలను విపరీతంగా పీడిస్తుండేవాడు. అతని హింసను తట్టుకోలేక పోయిన దేవతలు, వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నారు. దేవతల అభ్యర్థనలను ఆలకించిన విష్ణువు వైకుంఠాన్నుంచి దిగి వచ్చి మురాసురుని సంహరించాడు. ఆ సంహారం ఏకాదశినాడు జరిగినందువల్ల, ఈ రోజుకి ‘వైకుంఠ ఏకాదశి’ అని పేరు వచ్చింది.

విష్ణు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈరోజున వైష్ణవ దేవాలయలలొ ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ ద్వారాన్నే వైకుంఠ ద్వారమని పిలుస్తారు. ఆరోజున భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలను, స్నానసంధ్యాలు ముగించుకుని, విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి స్వామిదర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేస్తుంటారు. ఈ ప్రదక్షిణనే ముక్కోటి ప్రదక్షిణ అని అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారం ద్వారా దైవదర్శనంవల్ల సకల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం.

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి ఒక కథ చెప్పబడుతోంది. మహాప్రళయం జరిగింది. ప్రళయానంతరం, నీటి మీద తేలుతున్న విష్ణుభగవానుడు, మరలా సృష్టి చేయడాన్ని గురించి అఆలోచిస్తూండగా, ఆయన ముందు పంచభూతాత్మకమైన (ఆకాశం, అగ్ని, గాలి, నీరు, భూమి) బ్రహ్మాండం గోచరించింది. అనంతరం ఆయన బొడ్డులో నుండి ఓ తామరపువ్వు ఉద్భావించగా, అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు. బ్రహ్మకు, విష్ణుభగవానుడు మంత్ర, తంత్ర, శాస్త్రాలను బోధించాడు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిశ్శాస్త్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో మొరపెట్టుకోగా, అప్పుడు స్వామి శ్రీరంగనాథుని రూపంలో, తన భార్యలతో, పరివారగణంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు. ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి, బ్రహ్మకు జ్యోతిశ్శాస్త్రాన్ని బోధించి, తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మానవులు కోలుచుకునేందుకై స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా, స్వామి విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువైయ్యాడు.
కొంతకాలం తరువాత ఆ విగ్రహాల విమానం సూర్యవంశ మూలపురుషుడైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇవ్వబడి, కాలక్రమాన శ్రీరామచంద్రునికి చేరింది. రామావతారాన్ని ముగించే ముందు, శ్రీరాముడు ఆ విమాన విగ్రహాలను విభీషణుకి ఇచ్చి, తనకు చేసిన సహాయానికి గుర్తుగా తను ఆ విగ్రహాలను ఇస్తున్నట్లుగాను, వాటిని లంకకు తీసుకుని వెళ్ళి పూజాదులు చేయవలసిందిగాను, అయితే లంకకు చేరేవరకు విమానవిగ్రహాలను నేలపై పెట్టరాదని చెప్పాడు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు, లంకాద్వీపానికి బయలు దేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు, కావేరినదీ తీరాన్ని చేరుకునేసరికి సంధ్యావందనం చేయాల్సిన సమయమైంది. వెంటనే కావేరీతీరంలో స్నానం చేసి సంధ్య వార్చుకుందామనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను కిందపెట్టకూడదు కదా! ‘ఎలా?!’ అని అటూ ఇటూ చూసిన విభీషణుని కంట్లో బాలబ్రహ్మచారి కనపడ్డాడు. విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిని బ్రతిమాలి, తాను సంధ్య వార్చుకుని వచ్చేంతవరకు విమానాన్ని పట్టుకుని ఉండాల్సిందిగా చెప్పి, సంధ్యవార్చుకునేందుకై వెళ్లాడు. దానిని తీసుకున్న బాల బ్రహ్మచారి కొన్ని ఘడియలు మాత్రమే పట్టుకుంటానని, సమయం మించితే కింద పెట్టేస్తానని చెప్పాడు. అలాగే విభీషణుడు తిరిగి వచ్చేసరికి సమయం మించిపోవడంతో బాలబ్రహ్మచారి విమానాన్ని కింద పెట్టేశాడు. అది అక్కడ భూమికి అతుక్కుపోయింది.

ఇంతలో విభీషణుడు పరుగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బాలబ్రహ్మచారి అక్కడకు దగ్గరలోని కొండపైనున్న వినాయకుని గుడిలో దాక్కున్నాడు. కోపంతో వూగిపోయిన విభీషణుడు, వినాయకుని గుడిలోకి వెళ్ళి, ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక్క మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బ్రహ్మచారి తలపై సొట్ట పడింది. ఇంతకీ ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తూ వినాయకుడే. ఇప్పటికీ వినాయకుని విగ్రహంపై సోట్టను చూడవచ్చు. బాలబ్రహ్మచారి కింద పెట్టిన విమాన విగ్రహాలు కొలువైన ప్రాంత్రం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందగా, బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచ్చిలోని ఉచ్చి పిళ్ళైయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. వినాయకుడిని తలపై కొట్టిన విభీషణుడు, రంగనాథస్వామి పాదాలపై పడి లంకకు తనతో రమ్మని ప్రాధేయ పడ్డాడు. అయితే స్వామి అందుకు సమ్మతించక, తాను అక్కడే ఉండిపోనున్నట్లు, సంవత్సరంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తనను ఆరాధించ వచ్చని చెబుతాడు. విభీషణుడు స్వామికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలోని సప్తప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుని ఆలయాన్ని చూడవచ్చు. అప్పట్నుంచి భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఆత్యంత వైభవంగా జరుపబడుతోంది.

వైష్ణవ దేవాలయాలలో మామూలు రోజులలో అయితే ఉత్తరద్వారాలను మూసి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశిరోజున మాత్రం తెరచి ఉంచుతారు. మన రాష్ట్రంలోని తిరుపతి, భద్రాచలం మొదలైన క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. తిరుపతిలో ఈరోజు శ్రీవారిసన్నిథిన రావత్తు తోడక్కం జరుగుతుంది. నమ్మాళ్వారు విరచితమయిన భగవద్విషయమనబడే దివ్యప్రబంధంలోని నాలుగవ ఆయిరం అధ్యయనం జరుగుతుంది. వేదపారాయణం తోడక్కం తరువాత జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దేవస్థానం చుట్టూవున్న చూళిక ద్వారాలు తెరుబడుతాయి. భక్తులు ఈ చూళిక నుంచి ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఇక, భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని అధ్యయనోత్యవాలని పిలుస్తారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశీ మహోత్సవాలు ధను: శుద్ధ తదియతో ప్రారంభమయి ఏకాదశితో సమాప్తమవుతాయి. ఏకాదశికి ముందు పదిరోజులను అధ్యయనోత్సవాలని అంటారు. ఈ అధ్యయనోత్సవాల సమయంలో ధనుశ్శుద్ధ విదియ నుండి ధనుశ్శుద్ధ దశమి వరకు రోజుకొక అవతారం చొప్పున స్వామిని దశావతారాలతో అలంకరించి మధ్యాహ్నసమయంలో కళ్యాణమండప పందిరిలో వేంచేసి చేస్తారు. అనంతరం స్వామి తిరువీథి సేవకు బయలుదేరుతారు. ఏకాదశికి ముందురోజైన దశమినాటి సాయంత్రం గోదావరినదిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తరువాత పదిరోజులు మొక్షోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ ఇరవై ఒక్కరోజులలో చతుర్వేద పారాయణం, నాలాయిర దివ్యప్రబంధం పారాయణం చేయబడుతుంది. ఈ ఉత్సవాలను చూసి తరించేందుకు దేశం నలుమూలల నుండి భక్తజన సందోహం తరలి వస్తుంటారు.
ఏకాదశిరోజున ఉపవాసాన్ని పాటించాలి. ఈ రోజున ఉపవాసాన్ని పాటించడం వల్ల సూర్య, చంద్రగ్రహణ సమయంలో చేసే దానం, అశ్వమేథయాగం చేసిన ఫలితాలకంటే అధికపలం లభిస్తుంది. ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణం, అదీ పాటించకలేకపోతే నీరు, పాలు, పండ్లను తీసుకోవచ్చు. అలా కుదరనప్పుడు ఒక్కపొద్దు అంటే, ఒంటిపూట భోజనం చేయవచ్చు. సుఖ సంతోషాలను పంచే పండుగ వైకుంఠ ఏకాదశి.

No comments:

Post a Comment