27 August 2015

జంధ్యాలపౌర్ణమి :-

శ్రావణపౌర్ణమిని ‘జంధ్యాలపౌర్ణమి’ అని కూడా అంటారు. జంధ్యాల పౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. యఙ్ఞోపవీధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణపౌర్ఱమినాడు, విధిగా నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే, యఙ్ఞోపవీతంగల ప్రతివారు, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతకోసం, ప్రతినిత్యం సంధ్యావందనం చేసితీరాలి. కానీ, ఏదోఒక కారణంగా, ఏదోఒక సందర్భంలో తెలిసో తెలియకో, ఈ నియమానికి భంగం జరిగే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే, ధరించిన యఙ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యఙ్ఞోపవీతిన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లనుసరిదిద్దడానికే ‘శ్రావణపౌర్ణమి’ నాడు నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వులు ఓ ఆచారంగా ఏర్పాటుచేసారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునే వారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు.ముహూర్తంతో పనిలేకుండా ఈ రోజు ఉపనయనాలు చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.

ఎవరు ఎన్ని ముడులు ధరించాలి? బ్రహ్మచారి ఒక ముడి వున్న జంధ్యాన్ని ధరించాలి. గృహస్థుడు మూడుముడులు ధరంచాలి. అయితే కొందరు నాలుగు ముడులు, ఐదు ముడులు కూడా ధరిస్తూంటారు.
* మొదటిపోగు..., వైదిక నిత్యకర్మానుష్ఠానం కోసం, ** రెండవపోగు...,గృహష్థాశ్రమ ధర్మాచరణ కోసం, *** మూడవపోగు...,ఉపాకర్మ రోజున ఉపాంగవస్త్రంగా ధరించడంకోసం, **** నాల్గవపోగు...,తప్పనిసరి పరిస్థితిలో దానం చేయడం కోసం, ***** ఐదవపోగు..., పాముకాటుకుగురైన వారి కాలికి కట్టడానికి ఉపయోగంచేవారు.

యజ్ఞోపవీతము యొక్క ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలము వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి ఉంచుకొనవలెను. తదుపరి ఆచమనము చేసి యజ్ఞోపవీత ధారణా మంత్రము.

"యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః"


అని చెప్పుచు, ఒక పోగు "నిత్య కర్మానుష్టాన ఫల సిధ్యర్థం ప్రథమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని ధరించవలెను.

మరల ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ, రెండు పోగులను "గృహస్తాశ్రమ ఫల సిద్ద్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని జంటగా ధరించవలెను.

తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను.

మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.

తదుపరి పాత, క్రొత్త జంధ్యములను కలిపి కుడి చేతి బొటన వ్రేలు-చూపుడు వ్రేలు మధ్యన పట్టుకుని "దశ గాయత్రి" (పది మారులు గాయత్రి మంత్రమును) జపించి, యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మ చారులు ఒక్క ముడినే ధరించవలయును)

గాయత్రీ మంత్రము:-

"ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్"


తదుపరి ఈ క్రింది విసర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.

"ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణ కర్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తు మే"


తిరిగి ఆచమనం చేసి నూతన యజ్ఞోపవీతము తో కనీసం పది సారులైనను గాయత్రి మంత్రము జపించి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. తరువాత గాయత్రీ దేవత నుద్దేశించి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించ వలెను !!!

No comments:

Post a Comment