28 August 2015

బద్రీనాథ్ :-

బద్రీనాథ్ హిందువుల ఒక పుణ్యక్షేత్రం. ఇది భారతదేశంలో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా లో ఉన్న పంచాయితీ.

చార్ ధామ్(నాలుగు పట్టణాలు)లలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర హిందువుల ముఖ్యమైన యాత్ర. బద్రీనాథ్ గర్హ్వాల్ కొండలలో అలకనందానదీ తీరంలో 3133 మీటర్ల ఎత్తులో ఉంది. నర నారాయణ కొండల వరసలమధ్య నీలఖంఠ(6,560 మీటర్లు) శిఖరానికి దిగువభాగంలో ఉంది. బద్రీనాథ్ ఋషికేశ్‌కు ఉత్తరంలో 301 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌‌కు సమీపంలో ఉన్న గౌరీ కుండ్‌కు 233 కిలోమీటర్ల దూరంలో ఉంది.

బద్రీనాథ్ ప్రాంతం హిందూ పురాణాలలో బద్రీ లేక బద్రికాశ్రమంగా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. మహాభారతంలో శివుడు అర్జునినితో పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగానూ- కృష్ణుడు నారాయణుడిగానూ చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు అని చెప్పినట్లు వర్ణించ బడింది.

గంగానది భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తి వంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలీ నట్లూ దానిలో అలకనందానది ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి. తరువాతి కాలంలో అది విష్ణుమూర్తి నివాసమైనట్లు పురాణ కథనం.

బద్రీనాథ్ పరిసర ప్రాంతాలలోని కొండలూ వ్యాస విరచితమైన భారతంలో వర్ణించబడ్డాయి. శ్రీ కృష్ణ నిర్యాణానాంతరం పాండవులు తమ జీవితాన్ని చాలించతలచి స్వర్గారోహణ చేసిన పర్వతాలు ఇవేనని స్థలపురాణం చెప్తుంది. స్వర్గారోహణ సమయంలో వారు బద్రీనాధ్‌ మీదుగా ప్రయాణం చేశారని భారతంలో వర్ణించబడింది. స్వర్గారోహణలో వర్ణించిన మానా బద్రీనాథ్ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. మానా కొండలలో వ్యాసుడు వర్ణించినట్లు చెబుతున్న గుహ ఇప్పటికీ ఉంది.

స్కంద పురాణంలో బద్రీనాథ్ గురించి ఇలా వర్ణించబడింది స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాధ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదు. పద్మ పురాణంలో బద్రీనాథ్ పరిసర ప్రాంతాలు విస్తారమైన ఆధ్యాత్మిక నిధులకు మూల స్థానమైనట్లు వర్ణించారు. బద్రీనాథ్ విష్ణు నివాసంగానూ భూలోక వైకుఠం గానూ భక్తులచే విశ్వసించ బడుతుంది. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు మరియు వేదాంత దీక్షితులు ఇక్కడకు వచ్చి బద్రీనాధుని దర్శించుకుని ఉపనిషత్తులకు, బ్రహ్మ సూత్రాలకు భాష్యాలు వ్రాశారు.

బద్రీనాథ్ లో ప్రత్యేక ఆకర్షణ బద్రీనాధ్‌గుడి. పురాణ కథనం అనుసరించి ఆదిశంకరాచార్యులు అలకనందా నదీ తీరంలో లభించిన సాలిగ్రామ శిల్పంను తప్త కుండ్ వేడినీటి చలమ సమీపంలో ప్రతిష్టించి అక్కడ ఒక గుడి నిర్మించాడు. 16వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజు తిరిగి బద్రీనాథ్ విగ్రహాన్ని ప్రస్థుత ప్రదేశంలో ప్రతిష్ఠించి గుడి నిర్మించాడు.

బద్రీనాథ్ గుడిలో అనేకమార్లు కొండచరియలు విరిగి పడిన కారణంగా నిర్మాణ పునరుద్దరణ కార్యక్రమాలు నిర్వహించారు. 17వ శతాబ్ధంలో గర్హ్వాలా రాజుచేత ఈ గుడి విస్తరించబడింది. 1803లో హిమాలయాలలో సంభవించిన భూకంపంలో ఆలయం శిధిలం కావడంతో జయపూర్ రాజుచే ఈ ఆలయం పునర్నిర్మించబడింది.

బద్రీనాథ్ ఆలయం ఎత్తు గోపురంతో చేర్చి 50 అడుగులు. ముఖ ద్వారం శిలలతో కళాత్మకంగా నిర్మించారు. ఆలయం పై కప్పు బంగారు రేకులతో తాపడం చేయబడింది. ఆలయం ముందరి భాగంలో ఉన్న విశాలమైన మెట్లు ఆర్చిలా నిర్మించిన ప్రధాన ద్వారానికి తీసుకు వెళతాయి. ఆలయ నిర్మాణశైలి బుద్దవిహార నిర్మాణశైలిని పోలి ఉంటుంది. వర్ణమయంగా అలంకరించిన ముఖద్వారం బుద్ధ ఆలయాలను గుర్తుకు తెస్తుంది. మండపాన్ని దాటి కొంత లోపలభాగానికి వెళ్ళామంటే రాతి స్తంభాలతో నిర్మించిన మధ్య భాగం గర్భ ఆలయానికి తీసుకు వెళుతుంది. ఆలయంలోపలి స్తంభాలు, గోడలు అందంగా చెక్కిన శిల్పాలతో శోభాయమానంగా ఉంటాయి.

బద్రీ అంటే రేగుపండు నాధ్ అంటే దేవుడు ఇక్కడ రేగుపండ్లు విస్తారంగా పండటం వలన ఇక్కడ వెలసిన దేవునికి బద్రీనాధుడు అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి దీర్ఘ శీతాకాల శోషణ(అలసట)తీర్చడానికి రేగుచెట్టు రూపం దాల్చినట్లు పురాణాలు చెప్తున్నాయి.

బద్రీనాథ్ చైనా, టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదారినాధ్‌కు రెండు రోజుల ప్రయాణదూరంలో ఉంది. హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్(నాలుగు సౌధములు)లలో ఇది మొదటిది. ఇది ఓడలనుండి సరకు దిగుమతి చేసుకునే రేవులలో ఒకటి. బద్రీనాథ్ పోయే దారిలో హేమకుండ్ సాహెబ్ అనే సిక్కుల పవిత్ర క్షేత్రం మీదుగా పోవాలి. శీతాకాలంలో అతి శీతల వాతావరణం కారణంగా వేసవిలో మాత్రమే గుడిలో భక్తుల ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. బద్రీనాథ్, హేమకుండ్ కు వెళ్ళే భక్తులతో ఈ మార్గం వేసవిలో జనసమ్మర్ధం అధికమై రద్దీగా ఉంటుంది. బద్రీనాధుని దర్శించడానికి అనువైన కాలం జూన్ సెప్టెంబర్‌ల మధ్యకాలం. స్వెట్టర్లు మొదలైన చలిని తట్టుకొనే దుస్తుల అవసరం సంవత్సరమంతా ఉంటుంది. బద్రీనాథ్ మరియు పరిసర పల్లెలను బస్సు మార్గంలో చేరవచ్చు. 

ఆదిశంకరాచార్యుడు ఉత్తరభారతంలో స్థాపించిన జ్యోతిమఠం బద్రీనాథ్‌కు సమీపంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో ఉన్న ఇతర పుక్ష్యక్షేత్రాలు హరిద్వార్ మరియు కేదార్‌నాధ్.

ఈ క్షేత్ర మహత్యం స్కందపురాణంలో శివుడు తనపుత్రుడైన కుమారస్వామికి వర్ణించాడు.ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిప్రద అని,త్రేతాయుగంలో యోగసిద్దిద అని,ద్వాపరంలో విశాల అని పేర్లు ఉండేవి.జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని వాటినిజ్ఞానంవలన నశింపచేసే క్షేత్రంకనుక విశాల అనే పేరు వచ్చిందని పురాణ కథనం.ఇక్కడి రేగుచెట్టుకు అమృతం స్రవించినట్లు అందువలన ఇది బద్రీక్షేత్రమని పిలువబడినదని క్షేత్రపురాణం వివరిస్తుంది.బద్రీక్షేత్రంతో సమానమైన క్షేత్రం ముల్లోకాలలో లేదని శువుడు కుమారస్వామికి వివరించాడు.ఈ క్షేత్రంలో అన్ని లోకాలలోని తీర్ధాలు నిక్షిప్తమై ఉంటాయని స్కందపురాణం చెప్తుంది.ఇది విష్ణుక్షేత్రం విష్ణువు ఏక్షేత్రం విడిచినా ఈ క్షేత్రం విడువడని ప్రతీతి.ఈ క్షేత్రంలో అన్ని తీర్ధాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని వారణాశిలో అరవైవేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయదర్శన మాత్రంచే కలుగుతుందని పురాణకథనం.సమస్త దేవతలు మునులు నివసించడం వలన ఈ ఆలయానికి విశాల అని పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి.ద్వాపరయుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్దవుడిని ఈ క్షేత్రానికి వెళ్ళి తపసు చేయమని ఆదేసించడం వలన యాదవకుల వినాశనం జరిగినప్పుడు ఉద్దవుడు రక్షింపబడ్డాడు.

అతి సమీపంలోని విమానాశ్రయం డెహరాడూన్‌లో ఉన్న డెహరాడూన్(317కిలో మీటర్లు), సమీపంలోని రైల్వే స్టేషన్ హరిద్వార్ రైల్వే స్టేషన్ (310కిలోమీటర్లు) రిషికేశ్ రైల్వే స్టేషన్ (297) మరియు కోట్‌ద్వార్ రైల్వే స్టేషన్ (327 కిలో మీటర్లు). ప్రతి రోజు ఢిల్లీ, హరిద్వార్ మరియు ఋషికేశ్ లనుండి బస్సు సర్వీసులు (వసతులు) ఉంటాయి. రోడ్లు చాలా ఇరుకుగా ఉంటాయి కనుక ప్రయాణీకులు జాగ్రత్త వహించడం మంచిది. ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించడం ఉత్తమం. కొంతకాలం క్రితం వరకు ఇక్కడకు ప్రయివేట్ వాహనాలు నిషిద్దం కానీ స్వంత వాహనాలలో ప్రస్తుతం గుడి పరిసరాల వరకు ప్రయాణం చేయవచ్చు .

No comments:

Post a Comment