12 October 2015

సత్యం :-

భగవంతుడి అనుగ్రహం పొందాలన్నా, మోక్షం ప్రాప్తించాలన్నా సత్యమే ఆధారం. ఎందుకంటే సత్యమనేది ఒక సద్గుణం మాత్రమే కాదు. అది బ్రహ్మ స్వరూపం. అదొక మహత్తరమైన శక్తి. సత్యమనే మాట పలకడం ఎంత సులభమో సత్యమైన మాటను నిలుపుకోవడం అంత కష్టతరం. భగవంతుడు ఈ మానవ జన్మ ఇచ్చినందుకు జీవనసత్యం తెలుసుకోవాలి, ఆచరించాలి. ఇతరులకు సత్యవాక్పాలనలో ఆదర్శంగా నిలవాలి. పరోపకారమనేది అసలైన జీవన సత్యమని స్థూలంగా ధర్మశాస్త్రాలు చెబుతున్నా, సత్యంతో అనేక ధర్మసూత్రాలు ముడివడి ఉన్నాయి. ఇతరులను పీడించరాదనీ, సకల ప్రాణికోటినీ ప్రేమించాలనీ, స్వార్థ చింతనకు మనసులో తావీయరాదనీ ఉద్బోధిస్తారు. రుజువర్తన, నిజాయతీ, చిత్తశుద్ధితో జీవన ప్రస్థానం కొనసాగించాలనీ, అరిషడ్వర్గాలను దూరంగా ఉంచాలనీ, వీటన్నింటితోను సత్యమనే సద్గుణానికి సాన్నిహిత్యం ఉందనీ ఉపనిషత్తులు, వేదాలు చెబుతున్నాయి.

సత్యాచరణవల్లనే మనమేమిటో మనకు బోధపడుతుంది. తేజోమయ తపం వల్ల యజ్ఞం, సత్యం ఆవిర్భవించాయి. ధర్మాత్ముణ్ని ఆవలితీరానికి చేర్చే నౌక కేవలం సత్యమే. సత్యాసత్యాల మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉం టుంది. అంతిమ విజయం సత్యానిదే. సోమదేవుడు సత్యాన్ని పాటించి, అసత్యాన్ని అంతం చేస్తాడని వేద కథనం. అసత్యమాడినవారికి దుర్గతులు, సత్యమాడినవారికి సద్గతులు ప్రాప్తిస్తా యంటారు. 'సత్యం వద, ధర్మం చర'- సత్యాన్నే పలకాలనీ, ధర్మాన్నే ఆచరించాలనీ తైత్తరీయోపనిషత్తు చెప్పింది. సత్యపాలనలో అలక్ష్యం, ఏమరుపాటు తగదనీ వివరించింది. సత్యం పలకడమంటే అమృతపానం చేయటం.


తపస్సు చేసేవారికి, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవారికి, సత్యపాలన చేసేవారికే బ్రహ్మలోకం లభ్యమవుతుందని 'ప్రశ్నోపనిషత్తు' చెబుతోంది. సత్యనిష్ఠ మనిషిని శాశ్వతంగా పవిత్రుడిగా చేస్తుంది. దోషరహితుడైన యోగి, జ్యోతిర్మయ స్వరూపమైన పవిత్రమైన ఏ ఆత్మను దర్శిస్తాడో, అదే సత్యమని 'ముండకోపనిషత్తు' వ్యాఖ్యానిస్తోంది.

సృష్టిలోని సమస్త జనులకు సత్యమే శరణమనీ వారి ప్రతిష్ఠకు సత్యమే కారణమనీ, వారి శక్తికి మూలం సత్యమేననీ ఛాందోగ్యోపనిషత్తు ప్రవచిస్తోంది. అరుణ రుషి తన పుత్రుడైన శ్వేతకేతువుతో అష్ట సిద్ధుల్లో మొదటిదైన 'అణిమ'యే యావత్ప్రపంచానికి 'ఆత్మ' అనీ అదే సత్యమనీ, సకల జీవరాశుల మనుగడకు సత్యమే మూలబీజమనీ చెబుతాడు. సత్యపూర్వకంగా ప్రవర్తించినందువల్లనే దేవతలు కీర్తిని ఆర్జించగలిగారనీ, సత్యవాక్కు తప్ప మరేదీ పలకరాదని 'శతపథ బ్రాహ్మణం' బోధిస్తోంది. ఈ అఖిల సృష్టికీ సత్యసాక్షి సూర్య భగవానుడేనని చతుర్వేదాలూ అంగీకరించాయి. మానవుడు అసత్యమాడి చట్టం నుంచి, ధర్మం నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నా, కర్మ సాక్షి సూర్య భగవానుడి దృష్టినుంచి మాత్రం తప్పించుకోలేడు. యుగాలు, రుతువులు మారినా సత్యం మాత్రం మారదు. అది నిత్యమైనది. సత్యవాక్పాలకులను సర్వదా విజయం వరిస్తుంది. మానవతా విలువల్ని పెంచుతుంది. భగవదన్వేషణకు ఏకైక మార్గం సత్యమార్గమే.

తపస్సులలో సత్యపాలనను మించింది లేదు. తరచూ మనం స్వార్థపూరితమైన లాభాల కోసమేకాక, అసందర్భంగా, అకారణంగా అబద్ధమాడుతుంటాం. ఇలా అబద్ధాలకు పూనుకోవడం ద్వారా క్రమక్రమంగా భగవంతుడికి దూరమవుతున్నామన్న మాట. ఎందుకంటే సత్యమే పరమాత్మ. అసత్యమాడటమంటే నాస్తికతను ఆహ్వానించడమే. ఎవరికీ హాని జరక్కపోయినా, కాకతాళీయంగా వ్యర్థంగా అబద్ధమాడేస్తుంటాం. అది మన వ్యక్తిత్వాన్నీ, ప్రతిష్ఠనీ దెబ్బ తీసేదే! ఆధ్యాత్మిక సాధన అనే మొక్కకు అబద్ధమే చీడపురుగు. మన పూర్వీకులైన జ్ఞానులు, విద్యావేత్తలు, మహర్షులు, ధర్మవిదులు, వేదమూర్తులు, రాజులు, నేతలు సత్యం కోసం ఎంతటి మహత్తర త్యాగాలు చేశారో సర్వవిదితం.
మితభాషిత్వం సత్యవ్రతాచరణకు ఎంత గానో దోహదపడుతుంది. మౌనవ్రతమూ సత్యదీక్షకెంతో ప్రేరణ కలిగిస్తుంది. మనిషి జీవిత పర్యంతం కాపాడే ఏకైక పవిత్ర ఛత్రం 'సత్యం'! భగవంతుడితో మాట్లాడాలంటే మౌనమొకటే ప్రధాన సాధనం. ఇతరులకు అప్రియమైనదైనా సత్యమే పలకాలని మహాభారత సందేశం. 'బ్రహ్మ సత్యమ'న్న నిత్యసత్య నిర్వచనాన్ని అర్థంచేసుకోగలిగితే మానవ జీవనం నవజీవన- బృందావనమే!

No comments:

Post a Comment