10 December 2014

శంఖం :-

శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి !!


శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ దీని ధ్వని శోభను పెంచుతుంది. దీని పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలో శంఖం ఒకటి విష్ణు పురాణం ప్రకారం లక్ష్మి సముద్రతనయ అయివున్నది. శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను. ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, ఆరతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజలు వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధికల్గేది. దీనికి అనేక రకాల పూజా విధానాలు కలవు. పూర్వం కొన్నింటిని గృహ కృత్యాలలో తప్పనిసరిగా వాడేవారు. 

శంఖాలలో చాలా రకాలు వున్నాయి. రకాలను బట్టి పూజా విధానాలు కలువు. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది. ఈ శంఖాలు మానససరోవర్‌, లక్షద్వీప్‌, కోరమండల్‌, శ్రీలంక, భారతదేశంలోను లభిస్తున్నాయి. శంఖం యొక్క ఆకారాన్ని బట్టి వాటిని విభజిస్తారు ముఖ్యంగా 3 రకాలు 1. దక్షిణావృత శంఖం, 2. మధ్యావృత శంఖం, 3. ఉత్తరావృతవ శంఖం. ఎడమ చేతితో పట్టుకునే దానిని దక్షిణావృతమని కుడిచేతితో పట్టుకునే దానిని ఉత్తరావృత శంఖమని మధ్యలో నోరు వున్నదానిని మధ్యావృతమని అంటారు. ఈ శంఖాల పేర్లు ఈ విధంగా ఉన్నవి. 1. లక్ష్మీ శంఖం, 2. గోముఖ శంఖం, 3. కామధేను శంఖం, 4. దేవ శంఖం, 5. సుఘోష శంఖం, 6. గరుడ శంఖం, 7. మణిపుష్పక శంఖం, 8. రాక్షస శంఖం, 9. శని శంఖం, 10. రాహు శంఖం, 11. కేతు శంఖం, 12. కూర్మ శంఖం.

భారత యుద్ధ సమయంలో అనేక రకాల శంఖాలు పూరించారు. ఉదా:- శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరించాడు, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌంఢ్ర శంఖాన్ని యుధిష్ఠరుడు అనంత విజయ శంఖాన్ని, నకులుడు సుఘోష శంఖాన్ని, సహదేవుడు మణిపుష్పక శంఖాన్ని, కాశీరాజు శిఖండి శంఖాన్ని దుష్ఠ ద్యుమ్నుడు, విరాటుడు స్వాతిక శంఖాన్ని అలాగే ఇతర రాజులు అనేక రకాల శంఖాలు పూరించారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన ఖర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు. రుద్రపూజకు, గణశపూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు. దీనిని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దీనిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. దీనిని పూజించటం వల్ల వాస్తుదోషాలుపోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దానిని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి. విష్ణు శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. లక్ష్మి స్వయంగా శంఖం నాసహోదరి అని చెప్పిన సందర్భాలు కలవు. దేవి యొక్క పాదాలు వద్ద శంఖాన్ని వుంచుతారు. శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు. ఆడ మగ శంఖాలని రెండు కలిపి స్తాపించాలి. గణసు శంకాలలో నీరు నింపి గర్భవతులకు త్రాగించినట్లయితే గ్రుడ్డి, కుంటి, మూగ మొదలైన సంతానం కలగదు. అన్నపూర్ణ శంఖాన్ని ఆహారపదార్థాలలో స్థాపించి పూజిస్తారు. మణిపుష్పక్‌, పాంచ జన్యాలను కూడా అక్కడ స్థాపించి పూజిస్తారు. చిన్న శంఖ మాలలను ధరించి కూడా అనేక సిద్ధులను పొందుచున్నారు. శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం శంఖ ధ్వని వల్ల వాతావరణ లోపాలు, కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు. శంఖ బస్మము వల్ల అనేక రోగాలు నయము అగుచున్నవి. ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు శంఖమాలలు ధరింపచేసి వాటితో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు. శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి. కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. దానివల్ల భక్తుల కోర్కెలు తీరును. ఈ శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. శంఖము పాపనాశిని ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము. కొన్ని శంఖాల వివరణ: దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. దక్షణావృతంలో శివశంఖం, పాంచజన్యం మొదలగు రకాలున్నవి. పాంచజన్యం పురుష శంఖం ఇది దొరుకుట కష్టం. శని శంఖాలకు నోరు పెద్దది పొట్ట చిన్నది. రాహు, కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి. రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. ముత్యపు శంఖాలు పాలిష్‌ వల్ల వెండిలా మెరుస్తూ వుంటాయి. వినాయక శంఖం తొండాలతో కూడి ఉంటుంది. కూర్మ, వరాహ శంఖాలు తాబేలు, పంది ఆకారంలో ఉంటాయి. శంఖాలు ఎక్కువుగా రామేశ్వరం, కన్యాకుమారి, మద్రాసు, విశాఖపట్నం కలకత్తా, బొంబాయి మరియు పూరీలో ఎక్కువుగా దొరుకుచున్నవి. 

సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్‌.

శంఖం శుభ సూచకం, శుభ శకునం. ఉదయం లేవగానే శంఖాన్ని చూడాలి అని కూడా శకున శాస్త్రం చెప్తోంది. మనం సాధారణంగా చూసే శంఖాలన్నీ కూడా ఉత్తరం వైపువి లభిస్తూ వుంటాయి. దక్షిణావృతం దొరికితే మరింత విశేషం. వేదికపై స్వామిని ముందుగా పరిశుభ్ర జలంతో కడిగి మెత్తని పొడిబట్టతో మృదువుగా అద్దాలి. దేవతా స్వరూపాలన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనకు కుడివైపున దక్షిణావృత శంఖాన్ని తూర్పు అగ్రం వుండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. శంఖంలో నీరుని కలశంతో కానీ/గ్లాసుతోకానీ/ఉద్ధరిణెతో గానీ/ నింపాలి. శంఖాన్ని తీసుకొని చెంబులో ముంచి పెట్టకూడదు. శంఖంలో మొదలు భాగము అస్పృశ్యము, తాకరాదు. తరువాత దానితో అర్చన చేయాలి. శంఖంలో నీరు పోసే సమయంలో "శంఖపీఠే బ్రహ్మణే నమః" - శంఖ పీఠంలో బ్రహ్మదేవుడు వున్నాడు. ’శంఖాగ్రే సోమాయ నమః"; "మధ్యే గంగా సరస్వతేభ్యో నమః" ఇలా శంఖ పూజ చేయాలి. "ప్రణవేన శంఖం ద్వాదశవారం పూరయ్తిత్వా". మంత్రాలన్నీ రాకపోయినా శంఖంలో నీరు పోసే సమయంలో ప్రణవేన - ఓంకారంతో పన్నెండు మార్లు నింపాలి. అప్పుడు ఆ శంఖంలో ఉండే నీరు పవిత్రమవుతుంది. తీర్థమవుతుంది. దానిచేత ఆ పరమాత్మను అభిషేకం చేసి తిరిగి యథాస్థానంలో వుంచి తిరిగి నీళ్ళునింపాలి. శంఖాన్ని ఎప్పుడూ ఖాళీగా పెట్టకూడదు. మొదటగా పీఠాన్ని, తరువాత శంఖాన్ని, ఆ పిమ్మట పరమాత్మను అర్చించాలి. పరమాత్మను వుంచే పాత్ర బయట పళ్ళానికి ఎడమ వైపున శంఖాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

దక్షిణావృత శంఖం సముద్రంలో దొరికే శంఖం జాతికి చెందినది.శంఖాన్ని లక్ష్మీదేవికి సోదరుడుగా పూజిస్తారు.దక్షిణావృతశంఖాన్ని తూర్పు ముఖంగా ఉండి అభిషేకం చేసినప్పుడు కుడి ప్రక్కన అనగా దక్షిణం వైపు కడుపు (ఆవృతం) ఉంటంది కాబట్టి ఈ శంఖానికి దక్షిణావృతశంఖం అంటారు.దక్షిణావృత శంఖాలలో తెలుపు రంగులో ఉన్నవి శ్రేష్టం.ఎరుపు రంగు గీతలతో ఉన్న శంఖాలను కూడ పూజిస్తారు.
దక్షిణావృత శంఖాన్ని దీపావళి,అక్షయ తృతియ మరియు శుక్రవారం రోజు పూజిస్తే ఉత్తమ ఫలితాలు సాదించవచ్చు.దక్షిణావృత శంఖాన్ని పూజామందిరంలో ఎర్రని వస్త్రంపైనగాని,బియ్యం పైనగాని,కుంకుమ పైన గాని,కూర్మ స్టాండ్ పైనగాని ఉంచి లలిత సహస్త్రనామంగాని,లక్ష్మీ అష్టోత్తరం గాని చదువుతు పూజచేయాలి.ఇంకా శంఖంతో విగ్రహాలను అభిషేకించవచ్చును.


ఉపయోగాలు :-
1)దక్షిణావృతశంఖం ప్రత్యేకంగా జాతకచక్రంలో గల శుక్రగ్రహాదోషాలు పోగొడుతుంది.
2)దక్షిణావృతశంఖంలో నీటిని ఉంచి త్రాగటం వలన దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి.
3)దక్షిణావృతశంఖంతో పూజచేసెవారికి సరియైన సమయంలో వివాహం జరుగుతుంది.అంతేకాక వివాహ అనంతరం దాంపత్య జీవితంలో ఎటువంటి కలతలు ఉండవు.
4)దక్షిణావృతశంఖం ఇంటిలో ఉన్నవారికి ధనాభివృద్ది ఉంటుంది.
5)దక్షిణావృతశంఖం వ్యాపారస్ధలంలో ఉంచిన వ్యాపారాభివృద్ధితో పాటు ధనాభివృద్ధి కలుగుతుంది.
6)శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది.


No comments:

Post a Comment