12 December 2014

హనుమాన్ చాలీసా :-

ఉత్తరభారత దేశంలో క్రీ శ 16 వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసి దాసును సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ,ఓ ప్రాంతీయబాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెప్తాడు.
తులసీదాస్ రచించిన "రామచరిత మానస్" సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకధ ను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండే వాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతూండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీ దాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొఘల్ చక్రవర్తి అక్బర్ బాదుషా కు తరచుగా ఫిర్యాదులు వచ్చేవి. కాని అక్బర్ అంతగా పట్టించుకోలేదు. 

ఇది ఇలాగ ఉండగా వారణాసి లో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు,తన ఏకైక కుమారునికి చక్కని అమ్మాయితో వివాహం జరిపించారు. వారిద్దరు ఆనందంగా జీవితం సాగిస్తూ ఉండగా ,విధి వక్రించి ఆ యువకుడు కన్ను మూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపొయిన అతని భార్య హృదయవిదారముగా విలపించసాగింది. చనిపోయిన యువకుడికి అంత్యేష్టి జరగకుండా అడ్డుపడుతున్న ఆమెను బంధువులంతా ఆపుతూ ఉండగా ,ఆమె అక్కడ పక్కన తులసిదాస్ ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదాల వద్ద పడి రోదించసాగింది. అప్పుడు ఆయన రామ నామ ధ్యానం లో ఉన్నారు. హఠాత్తుగా కన్నులు విప్పి ఆమెను చూసి " దీర్ఘసుమంగళీ భవ" అని దీవించారు. అప్పుడు ఆమె జరిగినది అంతా తులసీ దాస్ కు విన్నవించుకుంది. అప్పుడు తులసీ దాస్ గారు....నా నోట అసత్యం పలికించడు రాముడు....అని అంటూ..... అప్పుడు ఆయన వారి కమండలం లో జలమును తీసి ఆ యువకుని దేహం మీద చల్లగానే అతనికి ప్రాణం లేచి వచ్చింది. ఆ మరు క్షణం అతను పునర్జీవితుడయ్యాడు. 

ఈ సంఘటన ప్రత్యేకించి తులసీ దాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగి రామ భక్తులుగా మారేవారి సంఖ్య నానాటికి ఎక్కువ అయిపో సాగింది. ఇంక ఉపేక్షించితే కుదరదు అని గ్రహించిన ఇతర మత పెద్దలంతా పాదుషా వద్దకు వెళ్ళి జరుగుతున్నవి వివరించి తగిన చర్య తీసుకోవలసిందిగా ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ పాదుషా వారు తులసీ దాస్ ను తన దర్బార్లోకి రప్పించారు. అప్పుడు ఆయనతో విచారణ ఇలా సాగింది. 

పాదుషా : తులసీ దాస్...మీరు రామనామం అన్నిటి కన్నా గొప్పది అని ప్రచారం చేస్తున్నారట? 

తులసీ దాస్ : అవును ప్రభూ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీ రాముడే ప్రభువు! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరం కాదు.! 

పాదుషా : సరే...మేము ఇక్కడ ఒక శవాన్ని చూపిస్తాము...దానికి ప్రాణం పోయండి ...రామ నామం తో బ్రతికించండి..అప్పుడు మీరు చెప్పినది నిజమని మేము నమ్ముతాము... 

తులసీ దాస్ : క్షమించండి ప్రభూ! ఫ్రతి జీవికి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్ఛానుసారం జరుగుతాయి....మానవమాత్రులు మార్చలేరు.. 

ఫాదుషా : అయితే తులసీ దాస్ జి! ఈ మాట ను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవి అన్నీ అబధ్ధాలు అని సభాముఖముగా అందరిముందు ఒప్పుకోండి! 

తులసీ దాస్ : క్షమించండి ...నేను చెప్పేది నిజం! పాదుషాకి పట్టరాని ఆగ్రహం వచ్చింది. "తులసి...మీకు ఆఖరి సారి అవకాశం ఇస్తున్నాను...నీవు చెప్పేవన్ని అబద్ధాలు అని ఒప్పుకో.....నీవు చెప్పేవన్నీ అబద్ధాలు అని చెప్పి నీ ప్రాణాలు దక్కించుకో.." అని పాదుషా వారు తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించాడు.

అప్పుడు తులసీ దాస్ కనులు మూసుకొని, ధ్యాన నిమగ్నుడై శ్రీ రామ చంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజ ధిక్కారముగా భావించిన పాదుషా తులసిని బంధించమని ఆదేశించాడు. అంటే.....ఎక్కడ నుండి వచ్చాయో ....కొన్ని వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసి దాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని ,వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్తు సంఘటనతో అందరు హడలిపోయి ఎక్కడివారు అక్కడ స్థాణువులై పోయారు. 

ఈ కలకలానికి కనులు విప్పిన తులసీ దాస్ కు సింహద్వారంపై హనుమ దర్శనము ఇచ్చారు. ఒడలు పులకించిన తులసీ దాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశారు. ఆ స్తోత్రంతో ప్రసన్నుడైన హనుమ " తులసీ ! నీ స్తోత్రముతో మాకు చాలా ఆనందమైనది..ఏమి కావాలో కోరుకో...." అన్నారు..అందుకు తులసీదాస్ "తండ్రీ! నాకేమి కావాలి.! నేను చేసిన ఈ స్తోత్రము లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు,నా జన్మ చరితార్ధమవుతుంది .నా ఈ స్తోత్రంతో నిన్ను ఎవరు వేడుకున్నా,వారికి అభయం ప్రసాదించు తండ్రీ!" అని తులసి కోరుకున్నాడు. 

ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమ "తులసి ! ఈ స్తోత్రం తో మమ్మల్ని ఎవరు స్తుతించిన,వారి రక్షణ భారం మేమే వహిస్తాము" అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు "హనుమాన్ చాలీసా" కామధేనువు అయి భక్తులను కాపాడుతూనే ఉంది. 

అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక "హనుమాన్ చాలీసా" దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతి ఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామ జ్యోతి ఎప్పటికి వెలుగుతూనే ఉన్నది... శ్రీ రామ జయ రామ జయ జయ రామ !



No comments:

Post a Comment